పాలకొండ వెబ్ న్యూస్: 18.03.2026.. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని ఇందిరానగర్ కాలనీలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించిన ఆయన, విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని స్వయంగా భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆహారంలో నాణ్యత లోపించడంపై జయకృష్ణ సిబ్బందిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల పౌష్టికాహారం కోసం ఎంతో కృషి చేస్తోందని, గిరిజన ప్రాంతాల నుండి నమ్మకంతో వచ్చే పిల్లలకు నాణ్యత లేని ఆహారం అందించడం తగదని ఆయన హెచ్చరించారు. పనితీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని మందలించారు. పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. త్వరలోనే మరోసారి తనిఖీకి వస్తానని స్పష్టం చేశారు.
news by: BSS Prasad
0 Comments