అగ్రిగోల్డ్ సమస్యను సత్వరమే పరిష్కరించాలి: ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్

పాలకొండ వెబ్ న్యూస్, 24 ఫిబ్రవరి, 2026:

​అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు విజయవాడలో యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ & ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు పార్వతీపురం లో డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ సంఘ భవనంలో గెంబలి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంస్థ మూతపడి 12 ఏళ్లు గడిచినా బాధితులకు పూర్తి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు కోర్టులో కేసుల భారం వల్ల జాప్యం జరుగుతోందని, అందుకే ప్రత్యేక కోర్టు అవసరమని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం వద్ద ఉన్న రూ. 5 వేల కోట్ల బినామీ ఆస్తులను అటాచ్ చేసి, వేలం ద్వారా బాధితులకు నగదు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే మార్చి 2 నుండి విజయవాడలో రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వి. తిరుపతిరావు, కూరంగి మన్మధరావు తదితరులు పాల్గొన్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments